పవన్ కళ్యాణ్.. ఆ పేరు చెబితేనే వణుకుతున్న ‘బ్లూ’ మీడియా.!

ఓ వ్యక్తి గురించి అవసరం వున్నా, లేకపోయినా ప్రస్తావించాల్సి రావడమంటే, ఒకటీ ఆ వ్యక్తి అంటే అమితమైన అభిమానం వుండాలి.. లేదంటే అమితమైన ధ్వేషం వుండాలి. ఈ రెండిటితోపాటు, బోల్డంత భయం వుంటేనే ఆ వ్యక్తి పట్ల అదే పనిగా దుష్ప్రచారం చేయాలి. బ్లూ మీడియా తీరు చూస్తోంటే, రెండోదీ.. మూడోదీ ఇక్కడ వర్తిస్తుందని చెప్పక తప్పదేమో.

తిరుపతి ఉప ఎన్నిక లో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ (మాజీ ఐఏఎస్ అధికారి) ఓడిపోయారు. ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. లక్ష ఓట్లు కూడా సాధించలేకపోయారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి మూడు లక్షలకు పైగా ఓట్లొచ్చాయి. రెండు లక్షల డెబ్భయ్ వేలకు పైగా ఓట్ల మెజార్టీతో అధికార వైసీపీ విజయం సాధించింది. ఇక్కడ వైసీపీ, తన స్థానాన్ని నిలబెట్టుకుందంతే. పైగా, సంక్షేమ పథకాల వల్ల తాము 5 లక్షల మెజార్టీతో గెలుస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా, అందులో సగం మెజార్టీకే పరిమితమవ్వాల్సింది.

విపక్ష నేతల్ని లాగేసుకుని, భయపెట్టి, దొంగ ఓటర్లను తీసుకొచ్చి.. ఇలా నానా రకాల గడ్డీ తింటేనే ఆ కాస్త మెజార్టీ అయినా దక్కింది. జనసేన – బీజేపీ మధ్య అవగాహనా లోపం సుస్పష్టం. జనసేనతో చర్చించకుండానే, తామే బరిలోకి దిగుతామని బీజేపీ ప్రకటించి పెద్ద తప్పు చేసింది. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికపై పడింది. ఇంకోపక్క, తెలంగాణ బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన చులకన వ్యాఖ్యలూ జనసైనికుల్లో ఆగ్రహం తెప్పించాయి.

ఇవన్నీ జనసేన – బీజేపీ అంతర్గత వ్యవహారాలు. కానీ, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారనీ, బీజేపీకి వెన్నపోటు పొడిచారనీ బ్లూ మీడియా కథనాలు తెరపైకొస్తే ఎలా.? 5 లక్షల ఓట్లతో గెలుస్తామన్న వైసీపీ, రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవడమేంటి.? అంటే, మంత్రులు వైసీపీ అధిష్టానానికి వెన్నుపోటు పొడిచారా.? లేదంటే, పార్టీనే.. వైసీపీ ఎంపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచిందా.? అన్నిటికీ మించి, చంద్రబాబు జీరో అయిపోయారు.. డిపాజిట్లు కూడా టీడీపీకి రావని చెప్పిన వైసీపీ, తెరవెనుకాల టీడీపీకి సహకరించడం వల్లే, సైకిల్ పార్టీ 3 లక్షల ఓట్లను సంపాదించగలిగిందా.? అదే నిజమై వుండొచ్చేమో.

పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి, వైసీపీ అనుకూల మీడియాకీ వెన్నులో వణుకు పుడుతోందంటే, ఖచ్చితంగా ఆయన ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై చాలా బలంగానే వుందన్నమాట. టీడీపీతో తెరవెనుకాల అంటకాగుతున్నదే వైసీపీ. లేకపోతే, ఆ పార్టీ టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైపోయి వుండేది.