‘పవర్ స్టార్’తో డాషింగ్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్..??

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మళ్లీ ఇండస్ట్రీలో చర్చనీయంశం అయింది. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంతకాలం ముంబైలో ఉన్నటువంటి పూరీ జగన్నాథ్ త్వరలో ఓ తీపి కబురు చెప్పబోతున్నట్లు టాక్. అది ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకొని సినిమా షూటింగ్స్ కు సిద్ధం కావడంతో పూరీ ఓ స్టోరీ సిట్టింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి పవన్ తో రెండు మూడుసార్లు చర్చలు జరిపాడట. అందుకే అప్పటినుండి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ఎలాగైనా పవన్ తో తీయాలని ఆయన స్పందన గురించి వెయిట్ చేస్తున్నాడట.

అయితే ప్రస్తుతం పవన్ చేతినిండా సినిమాలున్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ కూడా పూరీతో మరో సినిమా లైన్ చేయాలనీ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. అదికూడా అవకాశం ఇస్తే అతి తక్కువ టైంలోనే పవన్ తో జనగణమన తీసేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం సమకాలీన రాజకీయ ధోరణికి తగినట్లుగా పంచ్ డైలాగ్లతో చిత్రాన్ని రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసాడట. వీరిద్దరి కలయికలో ఇదివరకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా రూపొందింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్లాప్ అవ్వడంతో పవన్ ఇంతకాలం మళ్లీ పూరీతో సినిమా చేయలేదని అంటున్నారు.

కానీ అలాంటివి ఏం లేవని అందుకే మరో సినిమా చేయడానికి పరస్పరం ఇద్దరూ సిద్ధంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం పవన్ సినిమాల వైపు చూస్తే ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కంబ్యాక్ చేసాడు. మరో రెండు సినిమాలు మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం డైరెక్టర్ క్రిష్ తో హిస్టోరికల్ హరిహర వీరమల్లు మూవీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం పూరీ కూడా లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి టైంలో పూరీ సినిమా ఓకే అయితే గనక అది 2022 తర్వాతే వీలుపడే అవకాశం ఉందని టాక్. చూడాలి మరి పూరీ పవన్ కాంబో మరోసారి సెట్ అవుతుందేమో!