జనంలోకి జనసేనాని.. తుపాను బాధితులకు అండగా జనసేన.!

మొన్నీమధ్యనే నివర్‌ తుపాను దూసుకొచ్చింది. కొత్తగా మరో రెండు తుపాన్లకు అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌కి తుపాన్లు కొత్త కాదు. ఆ తుపాన్లతోపాటు నష్టమూ కొత్త కాదు. ‘మేం తుపాన్లను ఆపేశాం’ అంటాడొకాయన.. తుపాను కన్నా ముందే మేం సాయం ప్రకటించేశాం అంటాడు ఇంకొకాయన. అవునా.? అలాగైతే, తుపాను వచ్చిన ప్రతిసారీ ప్రజలెందుకు ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు.? ఏళ్ళు గడుస్తున్నా తుపాను సాయం అందలేదని జనం ఎందుకు గగ్గోలు పెడతారు.?

వరదొచ్చినా, తుపానొచ్చినా.. అధికారంలో వున్నోళ్ళకి పండగే. ఆ పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు.. తుపాను సాయాన్ని అడ్డంగా దోచేస్తారు. అందుకే, బాధిత ప్రజానీకం సాయం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. గ్రౌండ్‌ లెవల్‌లో జరిగిన నష్టం గురించి కేంద్రానికి సరిగ్గా నివేదించడమే ప్రభుత్వాలకు చేతకావడంలేదంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాల్ని నివర్‌ తుపాను కుదిపేసింది. వేల ఎకరాల్లో.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ‘మేం అత్యద్భుతంగా సాయం చేసేస్తున్నాం..’ అని చెప్పుకుంటోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ‘సాయం సంగతి దేవుడెరుగు.. మంచి నీళ్ళు ఇవ్వండి మహాప్రభో..’ అంటున్నారు బాధిత ప్రజానీకం. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాన్ని పక్కన పెట్టి, ప్రజలకు సాయంగా వుండడంలో జనసేనకి సాటి ఇంకెవరూ రారేమో. కృష్ణా నదికి వరదలొచ్చినా, గోదావరి నదికి వరదలొచ్చినా.. ప్రజలకు అండగా వుండడంలో జనసేన పార్టీదే మొదటి స్థానం.

జనసైనికులు తమ ప్రాణాలకు తెగించి.. బాధితుల్ని ఆదుకోవడం చూస్తున్నాం. వరద సాయం విషయమై ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా ఉద్యమాలు చేపట్టడమూ జనసేనకి తెలుసు. కాగా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నివర్‌ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు స్వయంగా తానే జనంలోకి వెళ్ళబోతున్నారు.

డిసెంబర్‌ 2న తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. జనసేనాని పర్యటన రాజకీయం కోసం కాదు.. బాధితుల ఆవేదనను తెలుసుకునేందుకు.. వారికి భరోసా ఇచ్చేందుకు.. సాయం అందించడంలో వైఫల్యం చెందుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు పాలకులకు అర్థమయ్యేలా తెలియజెప్పేందుకు.. అంటోంది జనసేన పార్టీ.