డాళింగ్ ఫ్యాన్స్ కొత్త ప్రభాస్ ను చూస్తారు: పూజ హెగ్డే

తెలుగులో పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు .. అవి సాధించిన విజయాలు .. రాబట్టిన వసూళ్లను చూసుకుంటే ఆమె నెంబర్ వన్ పొజీషన్ లో ఉందనే చెప్పుకోవాలి. సన్నజాజి మొగ్గలా చూపులను కట్టిపడేసే పూజ హెగ్డే ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జిగేల్ మంటూ మెరిసింది. కృష్ణంరాజు మాట్లాడుతున్నప్పుడు పూజ హెగ్డేను అప్పటికప్పుడు స్టేజ్ పైకి పిలిచారు. తనని ఎందుకు పిలుస్తున్నారనే విషయం తెలియక ఆమె అయోమయంలో పడింది.

అయితే స్టేజ్ పైకి చేరుకుంటూనే ఆమె కృష్ణంరాజు పాదాలకి నమస్కరించడంతో వేలాది అభిమానుల నుంచి ఆమెకి మంచి మార్కులు పడిపోయాయి. నిజానికి కృష్ణంరాజుకు .. పూజ హెగ్డేకి మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ నడిచేదే. అయితే ఆయన మాటలకు నవీన్ అడ్డు తగలడం .. పూజ చేతిలో మైకు లేకపోవడం .. మైకు కోసం వెతుకులాట .. ఇదంతా చూసేవాళ్లకి కాస్త ఇబ్బంది కలిగించింది. ఏం చేయాలో పాలుపోని పూజ హెగ్డేతో ‘నువ్వేమైనా రోమియోను అనుకున్నావా?’ అంటూ సినిమాలో ప్రభాస్ తో అనే డైలాగ్ ను కృష్ణంరాజుతో అనేలా చేయడం మనసుకు కాస్త కష్టాన్ని కలిగిస్తుంది.

ఇక ఆ తరువాత స్టేజ్ పై మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం తడుముకోకుండా తనదైన స్టైల్లో నాన్ స్టాప్ గా దంచేసింది. ” అందరూ బాగున్నారా .. నిజంగా ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిర్మాతలు ఈ సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించారు. ఇక మా దర్శకుడు రాధాకృష్ణకుమార్ గారు అదే పనిగా సినిమాపై కూర్చున్నారు. తాను అనుకున్నట్టుగా అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఆయన మమ్మల్ని వదిలిపెట్టలేదు. వేరే సినిమాల షూటింగ్స్ లో ఉన్నప్పటికీ పిలిచి మరీ చేయించారు.

‘రాధేశ్యామ్’ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇందులో ఏదో మేజిక్ ఉంది .. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సినిమాటోగ్రఫర్ మనోజ్ సార్ ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా నన్ను చాలా అందంగా చూపించారు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చేసిన సినిమా ఇది. ఆ సినిమాకి పూర్తి డిఫరెంట్ గా ఉండే కథ ఇది. డాళింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలో ప్రభాస్ .. నేను ఇద్దరం కూడా కొత్తగా కనిపిస్తాము. అంతా కూడా ఈ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూస్తారు. సంక్రాంతికి ఈ సినిమా వస్తోంది .. ఈ సంక్రాంతికి మీరు చాలా లక్కీ” అంటూ ముగించింది.