రాళ్లదాడిపై స్పందించిన పోసాని కృష్ణమురళి

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళి ఇంటిపై నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోసాని ఇంట్లో లేడని సమాచారం. ఈ క్రమంలోనే తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులేనని సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్ ను ఎందుకు తిడుతున్నారని అడిగితే దాడి చేస్తారా? అని పోసాని ప్రశ్నించారు. బుధవారం అర్థరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని ‘సాక్షి’తో మాట్లాడారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారు అని పోసాని అన్నారు. ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా పవన్ ను ఎవరైనా ఏమైనా అంటే కొట్టేవాడని పోసాని సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు.

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కోడైరెక్టర్ ను ఇలానే చొక్కా పట్టుకొని ఆవేశంలో కొట్టాడని.. ఆ తర్వాత అతడి తప్పు లేదని తెలిసినా సారీ చెప్పలేదని పోసాని వివరించారు. పవన్ కు ఆవేశం తప్ప ఆలోచనలేదన్నారు.

పవన్ ఊసరవెళ్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని పోసాని నిలదీశారు. డబ్బులు ఇచ్చి మరీ రాళ్లదాడి చేయిస్తున్నారని పోసాని ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేకున్నా తన భార్యను తిడుతున్నారని.. అయినప్పటికీ చిరంజీవి స్పందించకపోవడం బాధాకరమన్నారు.

చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు టీడీపీ నాయకులు తిడితే తాను ఫైట్ చేశానని గుర్తు చేశారు. చిరంజీవిని అన్నలా భావించి ఆయన కుటుంబాన్ని కాపాడానని.. ఇప్పుడు ఆయన తమ్ముడు దాడులు చేయిస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని పోసాని ప్రశ్నించారు.