యూపీ రాజకీయాల్లో ‘పుష్ప’ మేనియా..! ‘శ్రీవల్లీ..’ పాటతో కాంగ్రెస్ ప్రచారం

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప క్రేజ్ రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోయింది. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పుష్ప క్రేజ్ ను వాడుకుంటోంది. ప్రజలను ఆకర్షించేందుకు తమ ప్రచారంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాటకు అనుగుణంగా గీతాలను రూపొందించి ప్రచారంలో ఉపయోగిస్తోంది.

యూపీ గొప్పతనాన్ని వర్ణించేందుకు ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లీ..’ పాట ట్యూన్‌లో ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అని సాగే వీడియో సాంగ్‌ను చిత్రీకరించింది. ‘ఉత్తరప్రదేశ్ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్‌తో యూపీ కాంగ్రెస్ ఈ పాటను రూపొందించింది. ఈ పాటలను తన అఫిషియల్ ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పాట రాష్ట్రంలో హోరెత్తుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు. 2017 ఎన్నికల్లోనూ అక్కడ ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి.