వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టు వెనుక కథ ఇదీ.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. అంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తా కథనాల్ని చూస్తూనే వున్నాం. ఇంచుమించు ప్రతిరోజూ రచ్చబండ పేరుతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తూనే వున్నారాయన. ఆయన విమర్శల్లో కొన్ని సార్లు సహేతుకమైన విమర్శలూ వుంటున్నాయి. అందుకే, రచ్చబండ కార్యక్రమం అంతలా ఫేమస్ అయ్యింది.

సరే, తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు సొంత పార్టీలో కుట్ర పన్నినవారిపై ఆయన ఇలా కసి తీర్చుకుంటున్నారు.. తనపై ఇంత కుట్ర జరుగుతున్నా వాటిని చూస్తూ ఊరుకుంటున్న జగన్ మీదనా ఆయన కసి పెంచుకున్నారు.. అన్నది వేరే చర్చ. గత కొద్ది రోజులుగా రఘురామ తీరు మారింది. వైఎస్ జగన్ మీద మరింత తీవ్రమైన మాటల దాడి చేస్తున్నారు. అంతే కాదు, మిమిక్రీ చేస్తున్నారు.. ఇవన్నీ అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఇంకోపక్క, వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవలే రఘురామ, కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. సరిగ్గా శుక్రవారం.. రఘురామ అరెస్ట్ జరిగింది. ఈ శుక్రవారం లింకేంటన్నది ఇప్పుడు ఇంకో చర్చ. పనిగట్టుకుని ఓ వర్గంపై రఘురామ దుష్ప్రచారం చేస్తున్నారనీ.. ప్రభుత్వంపై కక్షపూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ.. కొందరి వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని సమాజంలో అలజడికి రఘురామ యత్నిస్తున్నారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ, ఏపీ సీఐడీ ఓ నోట్ విడుదల చేసింది.. రఘురామ అరెస్టుపై.

అరెస్ట్ చేశారు సరే, తర్వాత ఏం జరుగుతుంది.? రిమాండ్ విధిస్తే, ఆ తర్వాతి వ్యవహారాలుంటాయి. బెయిల్ కోసం రఘురామ కోర్టును ఆశ్రయిస్తారు.. తొందరగా కాకపోయినా, కొన్నాళ్ళ తర్వాత అయినా ఆయన బెయిల్ మీద వస్తారు.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.. ఇలాంటివారి విషయంలో ఏం జరిగిందో చూశాం. మరి, రఘురామ విషయంలో ఏం జరుగుతుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.