అభిమానులకు సూపర్ స్టార్ సారీ చెప్పబోతున్నాడా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లి నెల రోజులు తిరగకుండానే వెనక్కు వచ్చేశారు. ఆయన ఆరు నెలల పాటు అక్కడే ఉంటారనే వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని.. అందుకు గాను అమెరికాలో చాలా రోజుల పాటు చికిత్స తీసుకుని ఆ తర్వాత ఇండియాకు వస్తారని భావించగా మూడు వారాల్లోనే చెన్నైలో అడుగు పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ ప్రకటించిన తర్వాత రజినీకాంత్ అభిమానులను కలిసింది లేదు. అంతకు ముందు పదే పదే అభిమానులతో భేటీ అయిన రజినీకాంత్ పార్టీ గురించి చర్చలు జరిపారు.

ఎప్పుడైతే అనారోగ్య కారణాల వల్ల పార్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారో అప్పుడే కొందరు అభిమానులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఆయన ఆరోగ్యం ముఖ్యం అంటూ రాజకీయాలు వద్దని సలహా ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ ప్రకటించిన తర్వాత మొదటి సారి రజినీకాంత్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. రేపు పలు జిల్లాల అభిమాన సంఘాల నాయకులను కలిసేందుకు రజినీకాంత్ సిద్దం అయ్యారు. రజినీకాంత్ ఫ్యాన్ మీటింగ్ అంటే పండగ వాతావరణం ఉంటుంది. చెన్నైకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో పాటు ఆయన్ను కలిసి ఫొటోలు దిగేందుకు వేలాది మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అభిమానులు పెద్ద ఎత్తున రాబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా నమ్మకంగా చెప్పి చివరి నిమిషంలో తాను రావడం లేదు అంటూ చెప్పినందుకు క్షమించాలని అభిమానులను కోరే అవకాశం ఉంది. అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినందుకు సారి చెప్పడంతో పాటు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా ప్రకటించి అభిమానులను కాస్త ఉత్సాహ పర్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఇక రజినీకాంత్ నటించిన అన్నాత్తే షూటింగ్ పూర్తి అయ్యింది. దీపావళికి విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తదుపరి సినిమాను తన కూతురు దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.