చెర్రీ – పూరీ కాంబోలో మరో సినిమా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటుగా ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫైనల్ స్టేజీకి రావడంతో చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ని ఇటీవలే ప్రకటించారు. దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు చరణ్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే శంకర్ మరియు ‘ఇండియన్ 2’ నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా ‘RC15’ ప్రాజెక్ట్ గందరగోళంలో పడింది.

‘ఇండియన్ 2’ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా సంస్థ పట్టుబడుతోంది. శంకర్ ఈ సమస్యలను పరిష్కరించుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దీంతో RC15 ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆలోచనలో పడిన రామ్ చరణ్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరో దర్శకుడిని లైన్ లో పెట్టే పనిలో ఉన్నారట.

చరణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ – సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్స్ ఇదివరకే చర్చలు జరిపారు. ప్రశాంత్ నీల్ కూడా ఈ వరుసలో ఉన్నాడు. కాకపోతే వీళ్ళందరూ కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రాంచరణ్ తో సినిమా చేయడానికి చాలా టైం పట్టనుంది. దీంతో ఇప్పుడు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో డిస్కషన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

చెర్రీ ని ‘చిరుత’ సినిమాతో పూరీ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో మూవీ రాలేదు. ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు పూరీ. తదుపరి ప్రాజెక్ట్ కి ఇంకా కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో చరణ్ – పూరీ ల మధ్య ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత వచ్చే క్రేజ్ ని కాపాడుకోడానికి చరణ్ ఇకపై అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేయనున్నారని తెలుస్తోంది.