‘థాంక్యూ కలెక్టర్’ – బ్రేవ్ కలెక్టర్ల కథల్ని చెప్పబోతున్న ‘రిపబ్లిక్’ టీమ్..!

సుప్రీమ్ హీరో సాయి తేజ్ – ‘ప్రస్థానం’ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రిపబ్లిక్”. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెడుతునం మేకర్స్.. ‘థాంక్యూ కలెక్టర్’ అనే కొత్త ఇనిషియేటివ్ కి శ్రీకారం చుట్టారు. సరిహద్దుల్లో పోరాడే సైనికుల వీరగాధలు తెలుసుకున్నట్లే.. సరిహద్దుల లోపల పోరాడే ధైర్యవంతులైన కలెక్టర్ల కథలను అందరికీ తెలియజేయాలని ‘రిపబ్లిక్’ టీమ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘థాంక్యూ కలెక్టర్’ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.

”సరిహద్దుల్లో నిల్చొని విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికుడు అంటే మనకెంతో గౌరవం.. వాళ్ళ వీరగాధలు ఎన్నో విన్నాం చూశాం.. కానీ దేశ సరిహద్దుల లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థ మీద చేసే అన్యాయాల దాడి నుంచి దేశాన్ని కాపాడటానికి ప్రతిరోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారున్నారు.. పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనలో ఎంతమందికి తెలుసు. అలాంటి బ్రేవ్ కలెక్టర్స్ ని గుర్తించి ‘థాంక్యూ కలెక్టర్’ అనే ఇనిషియేటివ్ ద్వారా వారి కథల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం” అని సాయి తేజ్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

”రిపబ్లిక్” చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇందులో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ – జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.