‘ప్రాజెక్ట్ కే’ తర్వాతే సలార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వందల కోట్ల బడ్జెట్ సినిమాలను ఏడాదికి రెండు మూడు విడుదల చేసేలా ప్రభాస్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే పూర్తి అయిన రాధే శ్యామ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరిలో విడుదల చేయబోతున్నారు. మరో వైపు ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. ఇక ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే సగం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.

ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ప్రాజెక్ట్ కేను ప్రభాస్ మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. డిసెంబర్ 2 నుండి ప్రాజెక్ట్ కే సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి చేశాడు. అమితాబచ్చన్ పై ఆ షెడ్యూల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ 2 నుండి ప్రభాస్ మరియు కీలక నటీ నటులు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ డిసెంబర్ 2న ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మళ్లీ సలార్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే ను వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ప్రాజెక్ట్ కే మొదటి షెడ్యూల్ తర్వాతే సలార్ సినిమాను ప్రారంభించి ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ కేను పాన్ వరల్డ్ మూవీగా తీర్చి దిద్దుతున్నారు. దర్శకుడు ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ ను వాడుతున్నాడట. అందుకే షూటింగ్ కాస్త స్పీడ్ గా చేసి ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మెల్లగా క్వాలిటీగా చేయించాలని భావిస్తున్నారు. మొత్తానికి ప్రాజెక్ట్ కే సినిమా చిత్రీకరణ ప్రారంభం అవ్వబోతుందనే వార్త అభిమానులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్ కే లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తున్న విషయం తెల్సిందే.