సమంత చెప్పిన సందేశం..!

స్టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ కపుల్ విడాకుల గురించి ఊహాగానాలు మొదలైనప్పటి నుండి సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో ‘మై మమ్మా సెడ్’ (మా అమ్మ చెప్పింది) అనే హ్యాష్ ట్యాగ్ తో నిగూఢ అర్థం వచ్చే సందేశాలు పోస్టు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. విడాకుల ప్రకటన తర్వాత చాలా రోజులకు సమంత.. మరోసారి ‘మై మమ్మా సెడ్’ అంటూ మరో ఆసక్తికర పోస్ట్ చేసింది.

”ఇప్పుడు మీరిలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి.. అలాగే రేపు ఏం కావాలని కోరుకుంటున్నారో అందుకోసం నిరంతరం పోరాడుతూ ఉండండి” అని సమంత ఓ సందేశం పోస్ట్ చేసింది. అలానే “నేను గాలి దిశను మార్చలేను.. కానీ నా గమ్యాన్ని ఎల్లప్పుడూ నా గమ్యస్థానానికి చేరుకోవడానికి సర్దుబాటు చేయగలను” అంటూ జిమ్మీ డీన్ కొటేషన్ ను ‘మై మమ్మా సెడ్’ హ్యాష్ ట్యాగ్ తో రాసుకొచ్చింది.

ఇదే క్రమంలో సామ్ తాజాగా నవ్వుతూ ఉన్న ఒక సెల్ఫీ ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘హలో గ్లో..నేను నిన్ను మిస్ అయ్యాను’ అని క్యాప్షన్ పెట్టింది. సమంత పోస్ట్ చేస్తున్న కోట్స్ తనను తాను మోటివేట్ చేసుకోవడంతో పాటుగా.. ప్రజలకు ఏదో సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి మెసేజెస్ వల్ల సమంత ఇంకా లోలోపల తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తూ స్ట్రగుల్ అవుతుందనే విధంగా జనాలు ఆలోచించే అవకాశం కూడా ఉంది. అందుకే సామ్ నిఘాడ అర్థంతో సందేశాలు పోస్ట్ చేయకుండా.. కెరీర్ మీద ఫోకస్ పెట్టి స్స్ట్రాంగ్ గా నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా అక్టోబర్ 2న అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సమంత అధికారిక ప్రకటన చేసింది. అప్పటి నుంచి చై-సామ్ విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మీడియాకు దూరంగా సోషల్ మీడియాకు దగ్గరగా ఉంటున్న సామ్.. ఇటీవలే చార్ ధామ్ యాత్రకు వెళ్లి తిరిగి వచ్చింది. ఇందులో భాగంగా ఆమె గంగోత్రి – యమునోత్రి – బద్రీనాథ్ – కేదార్ నాథ్ లను సందర్శించారు. తన స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత.. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత సామ్ నైరాశ్యంలో కూరుకుపోయారని.. ఆ బాధలో నుంచి బయటపడేందుకే ఆమె తీర్థయాత్రలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ తో పాటుగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసింది. త్వరలోనే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ రానుంది. అలానే తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – నయనతార లతో కలిసి సామ్ ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. విడాకుల తర్వాత ఆమె రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా సందర్భంగా ఈ రెండు ద్విభాషా చిత్రాలను అనౌన్స్ చేసింది. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగుల్లో సమంత పాల్గొననుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ మూడు యూట్యూబ్ ఛానల్స్ పై సమంత కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై అవాస్తవలని ప్రచారం చేస్తున్నారంటూ సామ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పరువు నష్టం దావా కేసుపై ఈరోజు సోమవారం మరోసారి విచారణ జరగనుంది.