సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్‌ అప్‌డేట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా రెండవ షెడ్యూల్‌ మొదలయ్యింది. నేటి నుండి సినిమా షూటింగ్‌ షురూ అయ్యింది. దుబాయిలో మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఎట్టకేలకు రెండవ షెడ్యూల్‌ కు సిద్దం అయ్యారు. నేడు హైదరాబాద్‌ లో షూటింగ్‌ ను మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు. నేడు ఉగాది సందర్బంగా సెకండ్‌ షెడ్యూల్‌ ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

మహేష్‌ బాబుకు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న అవినీతి మరియు ఈజీ మనీ కోసం కొందరు చేస్తున్న పనుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. గీత గోవిందం వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.