శర్వా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్ షురూ..!

యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శర్వా.. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఒకే ఒక జీవితం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘మహాసముద్రం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. దీంతో శర్వా తన మూడో చిత్రం ”ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాపై కంప్లీట్ గా ఫోకస్ పెట్టడానికి రెడీ అయ్యాడు.

‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ”ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్కీ బ్యూటీ రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని రూపొందించిన సుధాకర్ చెరుకూరి.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శర్వానంద్ – రష్మిక మందన్న – కిషోర్ తిరుమల కలిసి తొలిసారి వర్క్ చేస్తున్న ”ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. శర్వా మరియు రష్మిక మొదటి రోజు నుండే టీమ్ తో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో హీరో హీరోయిన్లతో పాటుగా దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ కనిపిస్తారు. ప్రస్తుతం హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

”ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం మహిళల గొప్పతనాన్ని వివరించే ఆరోగ్యకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ పక్కింటి యువకుడి తరహా పాత్రలో నటిస్తుండగా.. రష్మిక నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ లో కనిపించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపా రాజు – బెనార్జీ – కళ్యాణి నటరాజన్ – రాజశ్రీ నాయర్ – ఝాన్సీ – రజిత – సత్య కృష్ణ – ఆర్సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.