అలరిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ లోని ‘తార’ పాట..!

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ”శ్యామ్ సింగ రాయ్”. ఇందులో సాయి పల్లవి – కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాకు బజ్ తెచ్చిపెట్టింది. మరికొన్ని గంటల్లో యూఏస్ఏ ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో.. మేకర్స్ తాజాగా సినిమాలోని ‘తార’ అనే మరో పాటను రిలీజ్ చేశారు.

‘తెర పైన కదిలేలా.. కథలేవో మొదలే.. తారా.. నింగి దిగే నేల.. కింద నడిచేలా.. వచ్చే ఇలా..’ అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఫిలిం మేకర్ అయిన నాని.. కృతి శెట్టి ని లీడ్ గా పెట్టి తన బృందంతో కలసి షూటింగ్ చేస్తుండటాన్ని ఈ సాంగ్ లో చూపించారు. ఇందులో కృతి చాలా అందంగా కనిపించింది. విజువల్ గా కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది.

ఈ పెప్పి నెంబర్ కు మిక్కీ జె మేయర్ ట్యూన్ కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించారు. యువ గాయకుడు కార్తీక్ ఎంతో హుషారుగా ఈ గీతాన్ని ఆలపించారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సత్యదేవ్ జంగా అందించిన ఈ కథలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. రాహుల్ రవీంద్రన్ – మురళీ శర్మ -అభినవ్ గోమటం – జిషు సేన్ గుప్తా – లీలా శాంసన్ – మనీష్ వాద్వా – బరున్ చందా కీలక పాత్రలు పోషించారు.