SSMB28 స్టోరీని మార్చేశారు..ఇప్పడు మరొటి కూడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి తన 28వ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం్ తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా అదుగో ఇదుగో అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన త్రివిక్రమ్ ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి మారింది. అక్కడ ఫైట్ మాస్టర్స్ అన్బు – అరివుల నేతృత్వంలో త్రివిక్రమ్ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని మొదలు పెట్టారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో షూటింగ్ కి బ్రేకిచ్చారు. ఆ తరువాత మహేష్ మదర్ ఇందిరా దేవి మృతి చెందడంతో మరింత గ్యాప్ పెరిగింది.

తిరిగి షూటింగ్ మొదలవుతుంది అనుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ మొత్తం మార్చేయడం దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చడంతో ఫస్ట్ షెబ్యూల్ మొత్తం వేస్ట్ అయిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో భారీ మార్పులతో సరికొత్త స్క్రీప్ట్ తో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మాత్తుగా మృతి చెందడంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాస్త డిసెంబర్ కు మారినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఇప్పటికే స్టోరీ మారిన ఈ ప్రాజెక్ట్ విషయంలో మరో మార్పుని హీరో మహేష్ కోరుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్న విషయం తెలిసిందే. ముందు నుంచి ఫ్యాన్స్ తమన్ ని పక్కన పెట్టమని అనిరుధ్ ని ఎంపిక చేసుకోమంటూ నెట్టింట కామెంట్ లు చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ కూడా ఫ్యాన్స్ తో ఏకీభవిస్తున్నాడట.

ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్ కు తమన్ ని తప్పించి అనిరుధ్ ని తీసుకోమని త్రివిక్రమ్ కు చెబుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. రీసెంట్ గా అనిరుధ్ ‘విక్రమ్’ మూవీకి అందించిన బీజీఎమ్ హాట్ టాపిక్ గా నిలవడమే కాకుండా ప్రతీ హీరో అనిరుధ్ తో కలిసి పని చేయాలని భావించడం మొదలు పెట్టారు. ‘విక్రమ్’ కు అనిరుధ్ అందించిన బీజిఎమ్స్ మహేష్ కు పిచ్చ పిచ్చగా నచ్చేశాయట. ఆ కారణంగానే తన సినిమాకు తమన్ ని పక్కన పెట్టి అనిరుధ్ ని తీసుకోవాల్సిందేనని చెబుతున్నాడట.

గత కొంత కాలంగా త్రివిక్రమ్ ..తమన్ తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడం లేదు. మహేష్ సినిమా విషయంలో మాత్రం అనిరుధ్ ని తీసుకోవడం తప్పేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో వారంలో దీనిపై క్లారిటీ రానుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి మళ్లీ ఫ్రెష్ గా పట్టాలెక్కించనున్నారు.