వ్యాక్సిన్ హెల్మెట్ వంటిదిః సినీ నటి

కరోనాకు ఇప్పటి వరకు ఉన్న మందు వ్యాక్సిన్ మాత్రమేనని అందువల్ల ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరుతున్నారు సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్. తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పిన ఆమె.. మిగిలిన వారుకూడా తీసుకోవాలని అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.

‘‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు బైక్ మీద వెళ్లేవారు ప్రమాదాన్ని ఊహించలేరు. కానీ.. వారు హెల్మెట్ ధరించి ఉన్నట్టయితే.. ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. టీకా తీసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ.. కరోనా తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది. ప్రాణాలకు హాని ఉండదు.’’ అని సూచించారు వరలక్ష్మి.

ఇంకా చెబుతూ… ‘‘ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడొద్దు. అందరికీ ఈ పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినా.. అది నార్మలే. ఇంకో విషయం ఏమంటే.. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎవరూ ఇప్పటి వరకు చనిపోలేదు. శరీరంలో మరేదైనా సమస్య ఉంటే.. దాని కారణంగా మరణించారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే.. సంబంధిత వైద్యుల సలహాలు తీసుకొని టీకా వేయించుకోవాలి. అందరం వ్యాక్సిన్ వేయించుకుందాం.. కరోనాను తరిమేద్దాం’’ అని సందేశం ఇచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్.