ఇంటర్వ్యూలలో మెగా హీరో ఇబ్బంది పడే పరిస్థితి ఉందా..?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” రిలీజ్ కు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 8) గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.

‘ఎఫ్ 2’ ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో జోష్ లో ఉన్న వరుణ్.. ”గని” సినిమాతో హ్యాటిక్ సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా ప్రిన్స్ చాలా కష్టపడ్డారు. ఫ్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి పర్ఫెక్ట్ బాడీని రెడీ చేశారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘గని’ మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. అంతా బాగానే ఉందనుకుంటుండగా.. హీరో వరుణ్ తేజ్ కు మీడియా ఇంటరాక్షన్ లో ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల హైదరాబాద్ లోని పబ్ రైడ్ సంఘటనలో వరుణ్ తేజ్ సోదరి నిహారిక పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 2.30 గంటల వరకూ నిర్వహించబడుతున్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా.. అందులో పాల్గొన్న 140 మందిలో నిహారిక కూడా ఉన్నారు.

పోలీసులకు ఘటనా స్థలంలో డ్రగ్ దొరికాయని.. కొందరి దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బడాబాబుల పిల్లలు కూడా ఉన్నారని టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గని’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇందులో పబ్ రైడ్ ఇన్సిడెంట్ కు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

దీంతో వరుణ్ తేజ్ అలాంటి ప్రశ్నలను దాట వేస్తాడా లేదా సినిమా గురించి మాత్రమే ప్రశ్నలు అడగమని ముందుగానే మీడియా మిత్రులకు సూచిస్తారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏదేమైనా మీడియా ఇంటరాక్షన్ లో మెగా హీరో జాగ్రత్తగా వ్యవరించాల్సిన పరిస్థితి వచ్చిందనేది అర్థం అవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.

‘గని’ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ మరియు రెనసాన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై అల్లు వెంకటేష్ (బాబీ) – సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇందులో వరుణ్ తేజ్ సరసన సైఈ మంజ్రేకర్ హీరోయిన్ ‏గా నటించింది. ఉపేంద్ర – సునీల్ శెట్టి – జగపతిబాబు – నదియా – నరేష్ – తనికెళ్ళ భరణి – నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.