ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ పై విజయేంద్ర ప్రసాద్‌ ఏమన్నారంటే..!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళ దిశ గా దూసుకు వెళుతోంది. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రచార ఒకటి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. బాహుబలి తరహాలోనే ఈ సినిమా కూడా సీక్వెల్‌ ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా బ్యాక్ టు బ్యాక్ 2 భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం వెంట వెంటనే రానక్కర్లేదు.

కథ మొదటి భాగం పూర్తి అయింది.. కావాలి అనుకుంటే రెండవ భాగాన్ని క్రియేట్ చేయవచ్చు అనేది రచయిత విజయేంద్రప్రసాద్ యొక్క అభిప్రాయం. తాజాగా దిల్ రాజు ఇచ్చిన సక్సెస్ పార్టీ లో రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడి దయ ఉంటే తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ కథను రాస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను చూస్తూ ఉంటే కచ్చితంగా సీక్వెల్ ఉంటుందేమో అనిపిస్తుంది. విజయేంద్ర ప్రసాద్ కథ ని రెడీ చేస్తే రాజమౌళి తీయడానికి కచ్చితంగా ముందుకు వస్తాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా కావాలని విజయేంద్ర ప్రసాద్‌ ఆ కథను రెడీ చేయాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.