వైఎస్ జగన్, షర్మిల.. మాట తప్పుతారు, మడమ తిప్పుతారు.!

కేసీయార్ హిట్లర్.. అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళిన వైఎస్ జగన్.. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వద్దని కేంద్రానికి లేఖ.. ఏపీకి నష్టం చేకూర్చే ప్రాజెక్టులపై మౌనం.. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు.. 2016 నుంచి ఇప్పటిదాకా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మాట తప్పిన, మడమ తిప్పిన వైనం ఇది.

అచ్చం అన్న బాటలోనే చెల్లెలు షర్మిల కూడా మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. 2013లో సమైక్యాంధ్ర నినాదం జపించారు.. హైదరాబాద్ వెళ్ళాలంటే పాకిస్తాన్‌కి వెళ్ళినట్టు పాస్‌పోర్టుతో వెళ్ళాలి.. అన్న నోటితోనే, తెలంగాణ తన మెట్టినిల్లు అంటున్నారు. తెలంగాణకు నష్టం జరిగితే సహించే ప్రసక్తే లేదంటూ షర్మిల నినదిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అటు వైఎస్ జగన్, ఇటు షర్మిల.. తెలుగు నాట విడిడిగా రాజకీయాలు చేస్తున్నారు.. కానీ, ఇద్దరి ఆలోచనా ఒకటే.. ఇద్దరి రాజకీయమూ ఒకటే. పైకి మాత్రం, ఒకరిది ఆంధ్రపదేశ్ రాజకీయం, ఇంకొకరిది తెలంగాణ రాజకీయం. ప్రజల్ని వెర్రి వెంగళప్పల్ని చేసి రాజకీయ నాటకానికి తెరలేపారు అన్నా చెల్లెళ్ళిద్దరూ.

చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ ఎందుకు జల దీక్ష చేశారు.? ఆ తర్వాత కేసీయార్‌తో రాజకీయంగా దోస్తీ ఎలా చేశారు.? షర్మిల, 2019 ఎన్నికల్లో వైసీపికి ఓట్లెయ్యాలంటూ ఆంధ్రపదేశ్ ప్రజలను ఎందుకు కోరారు.? ఇప్పుడు అన్నతో అయినా పోరాడేందుకు సిద్ధమంటూ తెలంగాణ తరఫున వకాల్తా ఎందుకు పుచ్చుకుంటున్నారు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు తయారైంది వైఎస్ జగన్, షర్మిల రాజకీయం.. అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందిప్పుడు.

చంద్రబాబు హయాంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఆయా ప్రాజెక్టుల సాక్షిగా రగడ చోటు చేసుకుంది.. తోపులాట చోటు చేసుకుంది. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారిందని.? ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని వైఎస్ జగన్ నాతో చెప్పారు..’ అని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీయార్ ప్రకటిస్తే, కేసీయార్ మీద ఘాటుగా స్పందించలేని దుస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది. ఆంధ్రపదేశ్ ప్రజలు తెలంగాణలో వున్నారంటూ కుంటి సాకు చెబుతున్న వైఎస్ జగన్, తెరవెనుకాల తన ఆస్తులు తెలంగాణలో భద్రంగా వున్నాలన్న ఆలోచనతోనే కేసీయార్ మీద నోరు పెగల్చలేకపోతున్నారన్నది విపక్షాలు సంధిస్తోన్న విమర్శ.

2019 ఎన్నికల్లో ఆంధ్రపదేశ్ ప్రజల్ని ఓట్లడిగిన షర్మిల, ఇప్పుడెందుకు తెలంగాణలోని అధికార పార్టీ మీద పోరాడలేకపోతున్నారు.? ఏం తేడా లేదు.. జగన్, షర్మిల.. ఇద్దరూ ఒకటే. ఇద్దరికీ ఆంధ్రపదేశ్ ప్రయోజనాలు అనవసరం.. అనుకోవాలేమో.