
టాలీవుడ్లో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక వర్గంపై మరో వర్గం సూటిపోటి వ్యాఖ్యలతో విరుచుకుపడుతూ, మొత్తం పరిశ్రమ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేస్తోంది. పర్సంటేజ్ విధానాన్ని సమర్థిస్తున్న ఎగ్జిబిటర్లు, అద్దె విధానానికే మద్దతు ఇస్తున్న నిర్మాతలు ఇప్పుడు “నువ్వా–నేనా” అన్న స్థాయిలో ఎదురెదురుగా నిలబడిన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ఉద్రిక్తతల మధ్య ఏషియన్ సునీల్ నారంగ్ వాట్సాప్ డీపీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తన భావోద్వేగాలు, దృక్పథాన్ని సూచించేలా పెట్టిన ఒక కొటేషన్ ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది. “ఒక విషయం గుర్తుపెట్టుకో.. ఫైటింగ్ మొదట నువ్వే ప్రారంభించకు.. ఒకవేళ వారు నిన్ను బలవంతం చేస్తే మాత్రం పూర్తిగా ఎదుర్కో” అని ఆయన డీపీలో పేర్కొనడం ద్వారా తన వైఖరి స్పష్టమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.
పర్సంటేజ్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్న ఎగ్జిబిటర్ల వర్గంలో సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, దిల్ రాజు వంటి కీలక పేర్లు ఉన్నట్లు చెబుతుండగా, మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్–నవీన్ ఎర్నేని, సితార నాగవంశీ, సాహు గారపాటి వంటి నిర్మాతలు దీనికి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు.
ఇది కేవలం విధానపరమైన విభేదం కాదని, క్రమంగా ఆధిపత్య పోరుగా మారుతోందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా సునీల్ నారంగ్–నాగవంశీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత చర్చనీయాంశంగా మారింది. సింగిల్ స్క్రీన్ల భవిష్యత్తు, మల్టీప్లెక్స్ విస్తరణపై ఇద్దరి మధ్య భిన్న అభిప్రాయాలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి.
ఇదే సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు ఇండస్ట్రీలో విభేదాలను మరింత పెంచుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఈ వివాదం కొన్ని పెద్ద సినిమాల విడుదల ప్రణాళికలపై కూడా ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది.
ఈ “అదృశ్య యుద్ధం” ఎటు దారితీస్తుందో, పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కరిస్తారా లేక ఈ పోరు ఇంకా తీవ్రమవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















