
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సంచలనం రేపిన త్విషా శర్మ మృతి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల త్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈసారి అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన నిపుణుల వైద్య బృందంతో శవపరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
అయితే ఈ రెండో పోస్ట్మార్టం భోపాల్లోనే నిర్వహించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్కు తరలించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన త్విషా శర్మ మే 12, 2026న భోపాల్లోని తన అత్తవారి ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. త్విషా కుటుంబ సభ్యులు ఆమెను అత్తింటి వేధింపుల కారణంగానే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు అత్తవారి కుటుంబం మాత్రం ఆమె డ్రగ్స్ అలవాటు కారణంగా మరణించిందని వాదిస్తోంది.
ఇక ఘటన జరిగినప్పటి నుంచి త్విషా భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉండటం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా, సమాచారం అందించిన వారికి బహుమతి కూడా ప్రకటించారు. అయితే త్వరలోనే సమర్థ్ సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోతాడని అతని తరపు న్యాయవాది తెలిపారు.
త్విషా కుటుంబ సభ్యులు తొలుత రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని దిగువ కోర్టును ఆశ్రయించారు. కానీ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. విధానపరమైన కారణాలను చూపుతూ రెండో పోస్టుమార్టంకు అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అలాగే మృతదేహాన్ని భద్రపరచేందుకు అవసరమైన అత్యల్ప ఉష్ణోగ్రత సౌకర్యాలు భోపాల్లో లేవని కూడా వ్యాఖ్యానించింది.
దీంతో త్విషా కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ వారికి ఊరట లభించింది.
ఇక ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని రాష్ట్ర హోంశాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 80(2), 85, 3(5)తో పాటు కట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందం నిర్వహించనున్న రెండో పోస్టుమార్టం నివేదిక ఈ కేసులో కీలకంగా మారనుంది. మరోవైపు సీబీఐ దర్యాప్తు కూడా ప్రారంభమైతే, త్విషా శర్మ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Recent Random Post:















