చరణ్-ఎన్టీఆర్ మధ్య గ్యాప్ నిజమేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ నిజమేనా? అభిమానుల వైరంలో అర్ధముందా? నిజంగానే ఇద్దరి మధ్య దూరం ఈ వార్ కి మరింత ఆజ్యం పోస్తుందా? అంటే అవుననే కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ సమయంలో తారక్..చరణ్ అభిమానులు పాలు నీళ్లలా కలిసి పోయారు. ఇద్దరి వేరైనా ఒకే సినిమాలో నటించే సరికి అభిమానులు మనసుల్లోనూ ఎలాంటి కలతలు చోటు చేసుకోలేదు. ఆ బాండిగ్ కి తగ్గట్టే చరణ్-తారక్ ఇంటర్వ్యూల్లో ఒకరి పనితనాన్ని మరోకరు పొగడటం వంటి సన్నివేశాలు ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ని మరింత దగ్గర చేసాయి.

ఇదంతా ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ కి ముందు మాట. మరి నేడు పరిస్థితి అంతుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అందుకు ఆజ్యం పోసిందా? గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ నా? లేక అభిమానుల అంతరమా? అన్నది క్లారిటీ లేదు గానీ..చరణ్-తారక్ మధ్య కొంత గ్యాప్ అయితే క్రియేట్ అయిందని పరిశ్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకు తగ్గట్టు కొన్ని బలమైన సంకేతాలు జనాల్లోకి అంతే బలంగానూ వెళ్తున్నాయి. అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ పక్కనబెడితే! ‘దాస్ కా ధమ్కీ’ ప్రచారంలో భాగంగా హాజరైన తారక్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి పనిచేసిన అందరి పేర్లు గుర్తు చేసుకున్నారు.

కానీ చరణ్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంతకు ముందు టైగర్ చేసిన ఓ ట్వీట్ లోనూ చరణ్ ప్రస్తావన తీసుకురాలేదు. ఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా ఇద్దరు ఆమెరికా ప్రయణాలు కలిసి చేసింది లేదు. మార్చి 27న జరిగిన రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లోనూ టైగర్ ఎక్కడా కనిపించలేదు. ఇక తారక్ విషయానికి వస్తే ఇటీవలే తారక్ ఓ ప్రయివేట్ పార్టీ ఏర్పాటు చేసారు. అందులో దర్శక..నిర్మాతలంతా పాల్గొన్నారు.

అలాగే విదేశీ సాంకేతిక నిపుణులు..ఆమెజాన్ వైస్ ప్రెసిడెంట్ సైతం తారక్ పార్టీలో మెరిసారు. కానీ అందులో రామ్ చరణ్ ఎక్కడా కనిపించలేదు. అప్పటికీ చరణ్ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా కొన్ని రకాల వ్యత్యాసాలు ఇద్దరిలోనూ కనిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ ఇమేజ్ అన్నదే ఈ పరిణామానికి ప్రధాన కారణమని కొందరి వాదన.

ఇద్దరి లో ఒకరికే ఆ ట్యాగ్ సొంతం తప్ప! ఇద్దరికీ ఎలా సాధ్యమనే అంశంపై ఫ్యాన్స్ నలుగుతోన్న రసాభాస హీరోలిద్దరి దృష్టికి చేరడం.. దానిపై చర్చ వంటివి సందేహంగానే కనిపిస్తున్నాయి. చరణ్ కి హాలీవుడ్ అవకాశాలు రావడం.. ఈ నేపథ్యంలో తారక్ బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవ్వడం వంటి సన్నివేశాలు టాలీవుడ్ ని ఎటు తీసుకెళ్తున్నట్లు? అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.