వైఎస్ షర్మిల వెకిలి రాజకీయం.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.!

పార్టీలో కింది స్థాయి నేతలు అదుపు తప్పి వ్యవహరిస్తే, అధిష్టానం తగు చర్యలు తీసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలి.. ఆయా నాయకులకు క్లాస్ తీసుకుని, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలి. కానీ, అధినేత్రి అదుపు తప్పే వ్యాఖ్యలు చేస్తే సరిదిద్దేది ఎవరు.?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విషయంలో వైఎస్ షర్మిల ఇప్పటికే ‘తేలిక’ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంకాస్త వెకిలితనం పులుముకున్నట్టుంది.. లేకపోతే, ‘కేసీయార్ కొడుకు’ అంటూ కేటీయార్ మీద షర్మిల సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేయడమేంటి.? అదీ, కేటీయార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, ‘కేసీయార్ కొడుకు’ అని నొక్కి వక్కాణించడమేంటి.?

సోషల్ మీడియా వేదికగా షర్మిల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులైతే బూతులతో విరుచుకుపడుతుండడం చూస్తున్నాం. రాజకీయాల్లో హుందాతనం అవసరం. కానీ, ఇప్పుడున్న నీతిమాలిన రాజకీయాల్లోంచి హుందాతనాన్ని ఎలా ఆశించగలం.? నాలుగు తిట్టి, నలభై నాలుగు తిట్లు తిట్టించుకోవడమే నేటి రాజకీయమైపోయింది. అయినా, కేసీయార్ పాలనా విధానాల్ని విమర్శిస్తే, కేటీయార్ వైఫల్యాల్ని నిలదీస్తే రాజకీయంగా ఎదగొచ్చుగానీ.. ఇలా స్థాయిని దిగజార్చుకుని వెకిలి వ్యాఖ్యలు చేస్తే ఎలా.?

తెలంగాణలో నిరుద్యోగులపై షర్మిల చేస్తున్న పోరాటాన్ని తప్పు పట్టలేం. ఈ విషయంలో ఆమె తెగువని అభినందించి తీరాల్సిందే. కానీ, ఈ క్రమంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, వైఎస్సార్ తెలంగాణ పార్టీని జనంలో పలచన చేసేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఆ పార్టీ అధినేత్రి షర్మిలే బలం, ఆ షర్మిల వ్యాఖ్యలే బలహీనత కూడా.

ఇక, షర్మిల ట్వీటుపై స్పందనగా ‘చంద్ర ప్రతాప్ రెడ్డిగారి మొదటి భార్య, అనిల్ శాస్త్రిగారి రెండవ భార్య.. వందలాది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారకులైన రాజశేఖర్ రెడ్డిగారి కూతురు, 16 నెలలు జైలు పక్షి జగన్ గారి చెల్లెలు షర్మిలగారికి ధన్యవాదాలు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఒకరు సోషల్ మీడియా వేదికగా ట్వీటేశారు.

తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపిస్తూ, షర్మిల మళ్ళీ కేటీయార్ మీద తాను అంతకు ముందు వేసిన ట్వీటుని స్క్రీన్ షాట్ పెట్టి పోస్ట్ చేయడం గమనార్హం. ఇక్కడ ఆమె ఉద్దేశ్యం సుస్పష్టం.. తెలంగాణ రాష్ట్ర సమితిని రెచ్చగొట్టి, ఆ తర్వాత ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొని, సింపతీ కార్డుని తెరపైకి తెస్తారన్నమాట.

ఇప్పటికే, మహిళల్ని అవమానిస్తున్నారంటూ షర్మిల, తెలంగాణ రాష్ట్ర సమితిపై నిందారోపణలు చేస్తున్న విషయం విదితమే. ‘కేసీయార్ కొడుకు..’ అంటూ షర్మిల వేసిన ట్వీట్, కేటీయార్ మద్దతుదారుల దెబ్బకి గల్లంతయ్యింది. దాంతో, ఆమె స్క్రీన్ షాట్ తిరిగి షేర్ చేయడం గమనార్హం. ఇంకేముంది, ఇంకోసారి ట్రోలింగ్.. షర్మిలకు వ్యతిరేకంగా.. బీభత్సంగా జరుగుతూనే వుంది. చిత్రమేంటంటే, తన ట్వీట్ డిలీట్ అయిపోయిన విషయాన్ని షర్మిల స్వయంగా పేర్కొనడం.