
తమిళ సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి. అధికార బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్.. ఇప్పుడు మరో కీలక నియామకంతో వార్తల్లో నిలిచారు.
విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్కు నిర్మాతగా వ్యవహరిస్తున్న కేవీఎన్ వెంకట్ నారాయణకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయనను నియమించినట్లు వార్తలు వెలువడడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నియామకానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. కేవీఎన్ వెంకట్ నారాయణ ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి పదవీకాలాన్ని పొడిగించే అవకాశం కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని సమాచారం. వేతనం, విధి విధానాలు, ఇతర నిబంధనలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో జననాయగన్ సినిమా కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ ప్రక్రియ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
కేవీఎన్ వెంకట్ నారాయణ బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సినీ రంగంలో ఉన్న అనుభవం, ప్రముఖులతో ఉన్న అనుబంధం, వ్యాపార నిర్వహణలో ఆయనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ బాధ్యతలు అప్పగించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ నియామకంపై ప్రభుత్వం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మరోవైపు జననాయగన్ నిర్మాతకు కీలక పదవి దక్కడం, విజయ్ ప్రభుత్వ నిర్ణయంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలవడం విశేషంగా మారింది.
Recent Random Post:















