ఉగాది నుంచే కొత్త జిల్లాల పాలన: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పాలనా వికేంద్రీకరణపై ప్రధానంగా దృష్టి సారించాం. సుపరిపాలన కోసం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి జీఎస్డీపీలో 0.22 శాతం వృద్ధి నమోదైంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన వృద్ధి సాధించాం. ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి’.

‘జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. గ్రీమీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎన్డీబీ సాయంతో 6400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టాం. 25 ఏళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. 9200 కి.మీ గ్రామీణ ప్రాంత రోడ్లను 1073 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా పనులు చేపడుతున్నాం. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేపట్టాం’.

‘దగదర్తి, భోగాపురం ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాం. 7015 కోట్లతో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. దేశంలో జరిగే ఎగుమతుల్లో 5.8 శాతం మేర ఏపీ నుంచే జరుగుతున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. నేరాల విచారణలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. మహిళలపై నేరాలను అరికట్టేందుకు దిశ యాప్ కీలకంగా మారింది. నవరత్నాల ద్వారా రాష్ట్రం ఆర్ధికాభివృద్ధి సాధిస్తోంది. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం. ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను వివిధ పథకాల ద్వారా ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు.